టాలీవుడ్ ఆడియన్స్ లో కృష్ణుడు పేరు చెప్పగానే నటులలో ముందు గుర్తుకు వచ్చే పేరు నందమూరి నటసార్వభౌమ తారక రామారావు. పౌరాణిక పాత్రల్లో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇలాంటి పాత్రలు నటించడంలో కొట్టిన పిండి. డైలాగులు, హావభావాలు పలికించడంలోనూ ఆయనకు తిరిగే ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పౌరాణిక సినిమాలకు ఓ నిఘంటువుగా ఎన్టీఆర్ ఉండేవారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పాత్రలో ఒదిగిపోయిన ఈయన.. కృష్ణడిగా అత్యధిక సార్లు తెరపై కనిపించి రికార్డును క్రియేట్ చేశాడు. మరి అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఎన్టీఆర్.. తన సినీ ప్రస్థానంలో నారదుడు, హనుమంతుడు పాత్రలో మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇదే విషయాన్ని ఓసారి ఆయన దగ్గర ప్రస్తావించగా.. ఆయన ఇలా సమాధానం ఇచ్చారట.
గతంలో షూటింగ్స్ జరుగుతున్న సమయంలో తరచు కరెంటు పోతూ ఉండేది. అలాంటప్పుడు చేసేదేమీ లేక కరెంట్ వచ్చేదాకా అందరూ ఫ్లోర్ బయటకు వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. అలా ఓ సందర్భంలో బయట కూర్చుని కబుర్లు చెబుతూ ఉండగా ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల గురించి టాపిక్ వినిపించిందట. అందరూ ఆసక్తిగా ఉన్న సమయంలో.. రావి కొండలరావు మధ్యలో కలగజేసుకొని నారదుడు, హనుమంతుడు ఇలాంటివి కూడా ముఖ్యపాత్రులే కదా.. అన్నగారు. ఈ పాత్రల్లో మిమ్మల్ని చూసే అవకాశం ఉంటుందా.. అని ప్రశ్నించాడట. అప్పుడు ఎన్టీఆర్ దానికి సమాధానం ఇస్తూ నారదుడిగా ఆలోచించాను బ్రదర్. కానీ హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా, సర్వజ్ఞుడిగా, గాంభీరంగా ప్రదర్శించాలి.
నా రూపం అందుకు సహకరించదేమో అనే ఉద్దేశంతో ఆ పాత్ర చేయడానికి సాహసించలేదు. నారదముని అంటే ఇలానే ఉండాలని మనం ఓ విధమైన రూపాన్ని ఫిక్స్ అయ్యాం. నా శరీరం కాస్త భారీ అవుతుందని నా అభిప్రాయం. అందుకే ఆ ఆలోచన విరమించుకున్నా.. రంగారావు గారిని నారదుడు పాత్రలో అంటే మనం అంగీకరించగలమా.. పర్సనాలిటీని ఒప్పుకోదు. ఇక హనుమంతుడు అంటారా.. నా మొఖం కానప్పుడు నాకు ఆ పాత్ర ఎందుకు.. మాస్క్తో నటించాలి. ఫిజికల్ మూమెంట్స్ ఎక్కువ కావాలి. అందుకే నేను ఆ పాత్రలో ఎప్పుడు చేయలేదు అంటూ చెప్పారట. పౌరాణిక జానపద సాంఘిక సినిమాల్లో వెండితెరిపై అదరగొట్టిన ఎన్టీఆర్.. తెలుగువారి గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు.