టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా మారింది. `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో వరుస ఫ్లాపుల నుంచి బయటపడ్డ ఈయన.. `లైగర్` సినిమాతో మళ్ళీ కోలుకొని దెబ్బ తిన్నారు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా కారణంగా బయ్యర్లు, నిర్మాతలుగా వ్యవహరించిన ఛార్మీ, పూరీ జగన్నాథ్లు భారీగా నష్టపోయారు. మరోవైపు ఈ సినిమా లావాదేల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గుర్తించడంతో.. పూరీ జగన్నాథ్, ఛార్మీలు చిక్కుల్లో పడ్డారు. ఈ సంగతి పక్కన పెడితే.. పూరీ జగన్నాథ్ తదుపరి చిత్రంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`ను పట్టాలెక్కించాలని భావించాడు. విజయ్ దేవరకొండ ఇందులో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ `లైగర్` దెబ్బకు ఈ ప్రాజెక్ట్ సైడ్ అయింది.
ఇతర హీరోలు సైతం పూరీ జగన్నాథ్ తో సినిమా అంటే వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ అభిమానులు మాస్ మహారాజ్ను రవితేజను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని రవితేజకు `ఇడియట్`, `నేనింతే`, `ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం` చిత్రాలతో స్టార్ హోదాను అందించింది పూరీ జగన్నాథే. ఈ నేపథ్యంలోనే కష్టాల్లో ఉన్న పూరీ జగన్నాథ్ తో ఓ సినిమా చేసి రుణం తీర్చుకో అంటూ రవితేజకు అభిమానులు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి రవితేజ పూరీ జగన్నాథ్ ను ఆదుకుంటాడా.. లేదా.. అన్నది చూడాలి.