టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో సుమన్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుమన్ ఎంతో మంది యువతను ఆకట్టుకున్నాడు. గతంలో చిరంజీవి, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన సినిమాలతో సక్సెస్ అందుకున్న సుమన్.. భక్తి రస సినిమాల్లో దేవుళ్ళ పాత్రలో నటించాలంటే అప్పటి స్టార్ హీరోలు అందరిలోనూ కేవలం సుమన్ కే అది సాధ్యమనేంతలా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అలా రాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి పాత్రలో మెప్పించిన సుమన్.. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలోనూ నటించి తన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు.
ఇక రజినీకాంత్ హీరోగా వచ్చిన శివాజీలో విలన్ రోల్ సుమన్కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇలా దాదాపు సినిమాల్లో అన్ని రకాల పాత్రలను పోషించిన ఆయన.. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. తర్వాత అనుకోని సంఘటనతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన సుమన్ మాట్లాడుతూ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. నేను మొదటి నుంచి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా.. అందుకే నన్ను మోసం చేసిన వాళ్ళని కూడా నేను ఎప్పుడూ ఏమీ అనను అంటూ చెప్పుకొచ్చాడు.
అలా నన్ను మోసం చేసిన వాళ్లలో కొంతమంది ఇప్పుడు లేరని.. ఉన్న వాళ్ళ కుటుంబాలు ఎవరు సహాయం చేయాలని పరిస్థితుల్లో ఉన్నాయని.. వాళ్ళని నేను మనసులో కూడా తిట్టుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ వాళ్ళు బాగుండాలనే కోరుకుంటా.. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరనేది నేను బాగా నమ్ముతా.. వాళ్ళను అలా చూడడం నాకు బాధగానే అనిపిస్తుంది అంటూ వివరించాడు. ప్రస్తుతం సుమన్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి.