బ్లాక్‌బస్టర్ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసి తప్పుచేసిన ఆ హీరో కూతురు..

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఉప్పెన’ సినిమాతో సముద్రమంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది కృతి శెట్టి. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ‘ఉప్పెన’తోనే ఆమె తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని కథానాయకుడిగా పరిచయం చేశారు. ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. డెబ్యూ హీరోతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమా ఇదే.

అయితే, ‘ఉప్పెన’లో హీరోయిన్ పాత్రకు కృతి శెట్టి మొదటి ఎంపిక కాదనే విషయం చాలా మందికి తెలియదు. ఈ పాత్ర కోసం మేకర్స్ మొదట ప్రముఖ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్‌ని సంప్రదించారు. అయితే ఆశ్చర్యకరమైన కారణంతో శివాని ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ఒరిజినల్ స్క్రిప్ట్‌లో భాగమైన బోల్డ్, ఇంటిమేట్ సన్నివేశాలలో నటించనని ఆమె చెప్పేసింది. చివరికి అదే తన కెరీర్ లో పెద్ద మిస్టేక్ అవుతుందని గ్రహించలేకపోయింది.

ఈ విషయాన్ని శివాని రాజశేఖర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కథ, ఆఫర్ తనకు బాగా నచ్చాయని, అయితే ఆ పాత్రకు కావాల్సిన లవ్ మేకింగ్ సీన్స్ విషయంలో కాస్త రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పింది. అలాంటి సన్నివేశాలు చేయడానికి తాను సిద్ధంగా లేనని, మేకర్స్‌కి తన అసౌకర్యాన్ని వ్యక్తం చేసింది. ఆమె అభిరుచులకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను సవరించే సమయానికి, ఆమె ప్రాజెక్ట్‌లో చేరడం చాలా ఆలస్యం అయింది. దాంతో చివరికి ఆ పాత్ర కృతి శెట్టికి వెళ్లింది, ఆమె తన కంఫర్ట్ జోన్‌లో సన్నివేశాలను చేయడానికి అంగీకరించింది.

‘ఉప్పెన’ సినిమా మిస్ అయినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని శివాని రాజశేఖర్ వెల్లడించింది. అలాగే ఈ సినిమాలో కృతి శెట్టి నటనపై ఆమె ప్రశంసలు కురిపించింది.