ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇందులో రామ్ చరణ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే చరణ్ గేమ్ ఛేంజర్ ను పట్టాలెక్కించారు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. మూవీ మేకర్స్ గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్ ను విక్రయించారట. జీ స్టూడియోస్ వారు కళ్లు చెదిరే ధరకు గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారట. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ. 275 కోట్లు పలికాయని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ టోటల్ బడ్జెట్ రూ. 450 కోట్లు కాగా.. ఓటీటీ డీల్ తోనే సగానికి పైగా బడ్జెట్ రికవరీ అయిపోవడం విశేషం. ఏదేమైనా ఈ రేంజ్ బిజినెస్ జరగడం మామూలు విషయం కాదనే చెప్పాలి.