జైలు సాక్షిగా కుదిరిన పొత్తు… పంపకాలపై క్లారిటీ వచ్చినట్లేనా….?

ముసుగు తొలగింది… ఇంతకాలం కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ… అది ఉంటుందా.. ఉండదా… పొత్తులపై ప్రకటన ఎప్పుడూ అనే మాట మాత్రం సస్పెన్స్‌గా మారింది. కొందరైతే… పొత్తు కుదిరింది… సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒకరు… కాదు కాదు… పవన్ డిమాండ్లను టీడీపీ పరిశీలిస్తోందని మరొకరు… పదవులపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఒకరు… ఇలా పలు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ – జనసేన పార్టీ నేతలు మాత్రం ఒకరి కార్యక్రమాల్లో ఒకరు పాల్గొనడం లేదు. అదే సమయంలో విమర్శలు కూడా చేయడం లేదు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో జరిగిన స్కామ్‌లో రూ.371 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ… చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో టీడీపీ శ్రేణులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా చంద్రబాబును జైలులో పరామర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్… పొత్తులపై కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. తమ పోరాటం ప్రజల కోసమన్నారు. వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. అదే సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్.

అయితే పవన్ ప్రకటన పొలిటికల్ సర్కిల్‌లో కలకలం రేపుతోంది. వాస్తవానికి దాదాపు ఏడాది కాలంగా రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం నడుస్తోంది. అయితే జనసైనికులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రి పదవి పవన్‌కు ఇస్తేనే పొత్తు పెట్టుకోవాలంటూ సూచనలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రెండు పార్టీల అభిమానుల మధ్య పెద్ద వార్ జరిగింది కూడా. ఎలాంటి అనుభవం లేకుండా పదవి ఎలా ఇస్తారని టీడీపీ వాదిస్తే… ఏ పదవి లేకుండానే లోకేశ్‌ను మంత్రి ఎలా చేశారని జనసైనికులు కౌంటర్ ఇచ్చారు. దీంతో పొత్తు పొడవక ముందే మాటల యుద్ధం జరిగింది. అయితే తాజాగా పవన్ ప్రకటనతో సీట్ల సర్దుబాటు మీద క్లారిటీ, పవర్ షేరింగ్ పైన కూడా ఓ ఒప్పందానికి వచ్చారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా కుదిరిన పొత్తుల చర్చల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ మాత్రమే పాల్గొన్నారు. మరి ఆ నలుగురు ఏం చర్చించారు… పొత్తుల్లో షరతులు ఏమిటనేది తెలియాలంటే… మరికొంత కాలం ఆగాల్సిందే.