టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `శౌర్యం` ఒకటి. తాజాగా శౌర్యం విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శౌర్యం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. అప్పటివరకు కెమెరామెన్ గా ఉన్న జె. శివకుమార్ ఈ మూవీతో డైరెక్టర్ గా మారాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
ఇందులో గోపీచంద్, అనుష్క శెట్టి జంటగా నటించారు. పూనమ్ కౌర్, శరత్ బాబు, సోనూ సూద్, మనోజ్ కె. జయన్, అజయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. మణిశర్మ స్వరాలు అందించాడు. 2008 సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తొలి ఆట నుంచే హిట్ అందుకున్న ఈ సినిమా.. ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద రూ. 13 కోట్ల షేర్, రూ. 25 కోట్ల రేంజ్ గ్రాస్ వసూళ్లను సాధించింది.
అయితే ఈ సినిమాతో పోటీగా అప్పట్లో విక్టరీ వెంకటేష్ `చింతకాయల రవి`తో వచ్చాడు. ఈ మూవీలోనూ అనుష్కనే హీరోయిన్ గా నటించింది. శౌర్యం రిలీజ్ అయిన వారం రోజుల గ్యాప్ లో చింతకాయల రవి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, శౌర్యం ముందు వెంకీ మూవీ నిలబడలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మారింది. అలా గోపీచంద్ తో పోటీ పడి వెంకీ ఘోరంగా ఓడిపోయారు.