గత కొద్ది రోజుల నుంచి బేబీ మూవీ విషయంలో ఓ వివాదం నడుస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలను పోషించారు. అయితే బేబీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ఆనంద్ కంటే ముందు ఓ హీరో వద్దకు బేబీ కథ చెప్పడానికి వెళ్లానని.. అయితే అతను స్టోరీ వినకుండానే రిజెక్ట్ చేశాడని ఎమోషనల్ అయ్యాడు.
దాంతో ఆ హీరో ఎవరా అని నెటిజన్లు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఇదే తరుణంలో విశ్వక్ సేన్ ఓ ట్వీట్ చేశారు. `నో అంటే నోనే.. అది మగాడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి కూల్ గా ఉందాం` అంటూ పరోక్షంగా ఓ కౌంటర్ వేశాడు. ఇది డైరెక్టర్ సాయి రాజేశ్కే అని స్పష్టంగా అర్థమైంది. తాజాగా మరోసారి సాయి రాజేశ్ కు విశ్వక్ సేన్ ఇచ్చిపడేశాడు. పేరు ఎత్తకుండానే బేబీని ఎందుకు రిజెక్ట్ చేశానో చెప్పేశాడు. తాజాగా ఓ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. `ఎవరి స్థాయిని బట్టి వారు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో స్పష్టత లేనప్పుడు ఎదుటివారి టైమ్ వేస్ట్ చేయకూడదనుకుంటాం.
అందుకే కలవలేం, కథ వినలేం అని దర్శకుడికి చెబుతుంటాం. గంట చర్చించి నో చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అనుకుని చెప్పా. దానికి కొంతమంది తెగ ఫీలైపోయారు. నేనేం చేయలేను. అందరినీ హ్యాపీగా ఉంచడానికి నేనేమి బిర్యానీని కాదు. మన సినిమా సక్సెస్ అయితే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, ఇతరులను కించపరచొద్దు. చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు అందరం ఆనందంగా ఉన్నాము. ఆ చిత్ర టీమ్ కి నేను విష్ కూడా చేశా.` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్ గా మారాయి.