యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య.. `బేబీ` మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించింది. తెలుగు హీరోయిన్ల సత్తా ఏంటో వైష్ణవి చైతన్య బేబీ మూవీతో అందరికీ రుచి చూపించింది. స్టార్ సెలబ్రెటీలు సైతం వైష్ణవి చైతన్యను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అంటూ ఆమె ఎంత అదర్భంగా నటించిందో వివరించక్కర్లేదు.
బేబీ విడుదలైన నాటి నుంచి టాలీవుడ్ లో వైష్ణవి చైతన్య పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా వైష్ణవి చైతన్య ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. రెండో సినిమానే ఓ స్టార్ హీరోతో చేయబోతోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు..ఉస్తాద్ రామ్ పోతినేని. బోయపాటి దర్శకత్వంలో `స్కంద` పూర్తి చేసిన రామ్.. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో `డబుల్ ఇస్మార్ట్`ను పట్టాలెక్కించాడు.
బ్లాక్ బస్టర్ మూవీ `ఇస్మార్ట్ శంకర్`కు సీక్వెల్ ఇది. ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అయితే ఒక హీరోయిన్ గా వైష్ణవి చైతన్యను ఎంపిక చేశారని అంటున్నారు. బేబీలో వైష్ణవి నటన పూరీని బాగా ఆకట్టుకుందట.
ఈ నేపథ్యంలోనే ఆమెను ఒక హీరోయిన్ గా తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల వైష్ణవికి రామ్ పెద్ద ఫ్లెవర్ బొకేను పంపాడు. అయితే అది బేబీ మూవీ సక్సెస్ అయినందుకు మాత్రమే కాదు.. డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్ గా ఎంపిక అయినందుకు కూడా అని అంటున్నారు.