ఆ నెల రోజులు బాధ భ‌రించ‌లేక‌పోయా అంటూ వాపోయిన జాన్వీ .. కార‌ణం ఏంటంటే?

అల‌నాటి తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి-బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ క‌పూర్ కుమార్తె జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో ఇప్ప‌టికే అర డ‌జ‌న్ చిత్రాల్లో న‌టించిన ఈ మ‌ద్దుగుమ్మ‌కు ఇంత వ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో జాన్వీ కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది. అన్న‌ట్లు త్వ‌ర‌లోనే ఈ అందాల సోయ‌గం తెలుగు తెర‌కు పరిచ‌యం కాబోతోంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష‌న్ లో ప్ర‌స్తుతం `దేవ‌ర` అనే పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ క‌పూర్ ఎంపిక అయింది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అలాగే బాలీవుడ్ లోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న జాన్వీ క‌పూర్‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది.

ఈ క్ర‌మంలోనే త‌న త‌ల్లి మ‌ర‌ణం గురించి త‌లుచుకుంటూ ఎమోష‌న‌ల్ అయింది. జాన్వీ క‌పూర్ త‌న డెబ్యూ మూవీ ధ‌డ‌క్ షూటింగ్ స‌మ‌యంలోనే శ్రీ‌దేవి మ‌ర‌ణించింది. అయితే అమ్మ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోయాన‌ని.. ఆమె లేని లోటు ఎవ్వ‌రు తీర్చ‌లేనిద‌ని జాన్వీ చెప్పుకొచ్చింది. `ఆ నెల మొత్తం అమ్మ లేరు అన్న బాధ‌ను భ‌రించ‌లేక‌పోయాను. నాకు ఏమీ అర్థం కాలేదు. ఏదో ఒక ప‌ని చేస్తూ ముందుకు సాగ‌డం క‌ష్టంగా అనిపించింది. ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు పెద్ద యుద్ద‌మే చేశాను` అంటూ జాన్వీ వాపోయింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.