`లైగర్` వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ పడినా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా, పరుశురామ్ తో ఒక సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.
గీతా గోవిందం వంటి సూపర్ హిట్ అనంతరం విజయ్, పరుశురామ్ కాంబోలో వస్తున్న రెండో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ హీరోగా చేస్తున్న 13వ ప్రాజెక్ట్ ఇది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.
అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట. అయితే ఈ సినిమాకు `ఫ్యామిలీ స్టార్` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కథానుగుణంగా ఈ టైటిల్ బాగుంటుందనేది చిత్రబృందం ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంటుంది.