లోకనాయకుడు కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరిదీ క్రేజీ కాంబో అని చెప్పాలి. గతంలో వీరిద్దరి కలయికలో `ఈనాడు` అనే సినిమా వచ్చింది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మ్యూజిక్ అందించింది. 2009లో ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే గతంలో కమల్ హాసన్ – వెంకటేష్ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది.
కానీ, షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు `మర్మయోగి`. చాలా ఏళ్ల క్రితం కమల్ హాసన్, వెంకటేష్ కాంబినేషన్ లో మర్మయోగి అనే పీరియాడిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి కమల్ హాసన్ స్వయంగా కథ రాయడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు.
కాస్ట్యూమ్ ట్రైల్స్ కూడా చేసి షూటింగ్ ను ప్రారంభించారు. కొంతభాగం షూటింగ్ జరిగిన తర్వాత ఏదో కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. గతేడాది `విక్రమ్` తెలుగు ప్రెస్ మీట్ లో కమల్ హాసన్ ఈ విషయాన్ని బయట పెట్టారు. మర్మయోగి చేసుంటే తమ కెరీర్ లో గొప్ప సినిమా అయ్యేదని, దురదృష్టవశాత్తూ మేము ఈ చిత్రాన్ని మిస్ అయ్యాము అంటూ కమల్ చెప్పుకొచ్చారు.