ఆర్జీవీపై దారుణమైన కామెంట్స్ చేసిన స్టార్ కమెడియన్..

టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పృథ్వీరాజ్ అని చెప్పడం కంటే ’30 ఇయర్స్ పృథ్వి ‘అంటే మాత్రం తొందరగా ప్రేక్షకులు గుర్తుపడతారు. కామెడీ పాత్రలలో ఎక్కువగా నటించే పృథ్వీరాజ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే ఈ మధ్య రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాడు పృథ్వి. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచాడు.

మొన్నటివరకు వైసీపీ పార్టీలో ఉన్న పృథ్వీరాజ్ కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకి వచ్చి జనసేన పార్టీలో చేరిపోయాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వి రాజ్, రామ్ గోపాల్ వర్మ పై విమర్శలు కురిపించాడు. ఇటీవలే ‘వ్యూహం’ అనే సినిమా తీయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేసాడు. ఏపీలో ప్రతిపక్షాల ఓటమిని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమా ఇది అని వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బతీసే విధంగా ‘వ్యూహం’ సినిమా ఉంటుందని సమాచారం. అయితే ఇదే విషయంపై పృధ్వీరాజ్ ని ప్రశ్నించగా ఆయన సమాధానం చెబుతూ ‘అసలు రామ్‌గోపాల్ వర్మ తీసే సినిమాలు జనాలు చూడరు’ అంటూ కొట్టి పారేశాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు ఎన్నో తీశారు. కానీ అవేమీ రాజకీయాలపై ప్రభావం చూపించలేవని పృథ్వీరాజ్ అన్నారు.

ప్రతిపక్షాల మీద వ్యతిరేకత తీసుకురావడం కోసమే ఆర్జీవీ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడని అన్నారు. “అలాంటి అతనికి వ్యతిరేకంగా మేం ఎలాంటి సినిమాలు తియాలని అనుకోవడం లేదు, ఎందుకంటే మాది అంతా నీచమైన పార్టీ కాదు” అని పృథ్వి చెప్పారు. ఒకవేళ సినిమా చేయాలనుకుంటే వాళ్లు నాలుగేళ్లుగా చేస్తున్న దాని గురించి తీస్తే బాగుంటుంది గానీ ప్రతిపక్షాల మీద ఇలా సినిమా తీయడం వల్ల ఏం వస్తుందని పృధ్వీరాజ్ మండిపడుతున్నారు. అయితే ఆర్జీవి తీయబోయే వ్యూహం సినిమా ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది వేచి చూడాలి.