బ్లాక్ కమాండోస్ తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారని, అసలు ఏం అర్హత ఉందని చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారని, దేశంలో అనేక మందికి ప్రాణాలకు ముప్పు ఉందని, వారికి ఇవ్వని సెక్యూరిటీ బాబుకు ఎందుకని, తక్షణమే సెక్యూరిటీ ఉపసంహరించుకోవాలని ఏపీ స్పీకర్ గా తాను కేంద్రానికి లేఖ రాస్తానని తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అసలు సెక్యూరిటీనే చూసుకునే బాబు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, సెక్యూరిటీ లేకపోతే ఫినిస్ అయిపోతారని, అధికారం లేక బాబు విల విల లాడుతున్నారని అన్నారు. అయితే చంద్రబాబుపై రాజకీయంగా విమర్శలు చేయడమో..లేక ఇంకో అడుగు ముందుకు వేసి..ఆయన్ని బూతులు తిట్టడమో వైసీపీ నేతలు చేస్తున్నారు. కానీ అవేమీ లేకుండా తమ్మినేని కేవలం సెక్యూరిటీకి సంబంధించిన అంశాలనే మాట్లాడారు. సెక్యూరిటీ లేకపోతే ఫినిష్ అయిపోతారని అన్నారు. అంటే బాబు ప్రాణహాని తలపెట్టాలని వైసీపీ చూస్తుందా? అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసిన తమ్మినేనిపై టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు.
తమ్మినేని సొంత స్థానం ఆమదాలవలసలో టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. టిడిపి నేత కూన రవికుమార్..తమ్మినేనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు తలపెట్టే కుట్ర జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని, జడ్ కేటగిరీ కమాండోలు లేకుంటే చంద్రబాబు ఫినిష్ అంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఫ్యాక్షన భావజాలానికి అద్దం పడుతున్నాయని టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.
ఇతర పార్టీల నేతలు సైతం తమ్మినేని వ్యాఖ్యలని ఖండించారు. దీన్ని సుమోటోగా స్వీకరించి స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అలా మాట్లాడి తమ్మినేని లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నారు. అసలే రాజకీయంగా మైనస్ లో ఉన్నారు. ఈ దెబ్బతో ఇంకా రిస్క్ లో పడ్డారు.