ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి నేనంటే నేనే అని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కాగా, మరొకరు.. ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు. తాజాగా.. ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజకీయసెగ మరింత పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అని చర్చ కూడా మొదలైంది.
రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు చెల్లుబోయిన విజయం దక్కించుకున్నారు. అదే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన తోట త్రిమూర్తులు పరాజయం పాలయ్యా రు. అనంతరం.. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ అయ్యారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రంగంలోకి దింపి.. గెలిపించుకునే వ్యూహంతోఉన్నారు తోట. కొన్నాళ్ల కిందట తన కుమారుడిని జగన్కు కూడా పరిచయం చేశారు.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇస్తే.. గెలిపించి తీసుకువచ్చి.. గిఫ్ట్గా ఇస్తానని.. చెబుతున్నారు. మరోవైపు చెల్లుబోయిన.. దీనిని సవాల్గా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో నూ తనకే టికెట్ ఇవ్వాలని.. కోరుతున్నారు. ఇప్పటికే తనకు అనుకూలంగా ప్రజలు ఉన్నారని.. తనకు తిరుగే లేదని.. ఆయన పరోక్షంగా సంకేతాలు పంపిస్తున్నారు. పైగా.. బీసీ కార్డును బాగా వాడుతున్నారు. ప్రజల్లోనూ ఉంటున్నారు.
దీంతో అటు తోట.. ఇటు చెల్లుబోయిన ఒకేటికెట్ కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమం లోనే తోట కన్నా.. రెండడుగులు ముందుండాలని ప్రయత్నిస్తున్న చెల్లుబోయిన.. ఎస్సీ ఓట్లను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి.. వారి మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. దీంతో తోటకు చెల్లుబోయిన చెక్ పెడుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.