టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీని ప్రక్షాళన చేస్తేనే తప్ప.. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు. అప్పుడే గెలుపు గురించి ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఆయన ఉద్దేశంలో ప్రక్షాళన అంటే.. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన చేయడమా.. లేక విజయవాడ వరకే పరిమితం కావడమా? అనేది చర్చకు దారితీసింది.
నిజానికి ఎంపీ నాని వ్యాఖ్యల అంతరార్థం.. పరమార్థం కూడా.. విజయవాడలోఅంటే.. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి కూడా కారణం ఉంది. కొన్నాళ్లుగా.. పార్టీలో ఉన్న విజయవాడ నాయకులతో ఎంపీగారికి విభేదాలుకొనసాగుతున్నాయి. కనీసం .. తనను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా.. తన సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ను ప్రోత్సహించడాన్ని ఆయన సహించలేకపోతున్నారు.
కానీ, స్థానికంగా ఉన్న ఒక ఎమ్మెల్యే, ఇతర నాయకులు.. కూడా.. శివనాథ్ చుట్టూ చేరారు. ఆయన చుట్టూనే రాజకీయాలు చేస్తున్నారు. ఆయనతోనే కార్యక్రమాలు చేయిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా.. కేశినేని నాని కన్నా.. కేశినేని చిన్ని పేరు మార్మోగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటును చిన్ని కోరుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. అంతేకాదు.. లోకేష్పాదయాత్ర కు విజయవాడ పరిధిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచి స్కెచ్సిద్ధం చేసుకుంటున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా.. పాదయాత్ర మార్మోగేలా చేయాలని భారీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నా రు. ఈ క్రమంలో తనను కాదని.. తన తమ్ముడి చుట్టూ చేరిన వారిపై ఎంపీ నాని నిప్పులు చెరుగుతున్నా రు.అడపా దడపా.. వారిని టార్గెట్ కూడా చేస్తున్నారు. అయినప్పటికీ.. అధిష్టానం మాత్రం మౌనంగా ఉంది. ఈ పరిణామాల నేథపథ్యంలోనే తాజాగా పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయనపిలుపునిస్తున్నారు. అంటే.. విజయవాడలో ఉన్న పార్టీ నాయకులను గుండుగుత్తుగా తీసేయాలని చెబుతున్నారు. మరి ఇది సాధ్యమేనా? చూరులో ఎలుకలు ఉన్నాయని .. చంద్రబాబు ఇంటికి నిప్పు పెట్టు కుంటారా? చూడాలి!!