పాపం శృతి హాస‌న్‌.. అటు బాల‌య్య ఇటు చిరు ఇద్ద‌రూ మోసం చేశారుగా!

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `వాల్తేరు వీరయ్య`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.

అయినాస‌రే ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్మ దుమారం రేపుతున్నాయి. ఇక‌పోతే ఈ రెండు చిత్రాల‌తో శృతి రేంజ్ మారిపోతుందని అంద‌రూ భావించారు. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ శృతి పాత్రకు స‌రైన‌ ప్రాధాన్యత ద‌క్క‌లేదు. బాల‌య్య సినిమాలో ఈషా అనే అల్లరి అమ్మాయి పాత్రను పోషించింది.

అయితే ఫ‌స్టాఫ్ లో రెండు, మూడు స‌న్నివేశాల‌కు మ‌రియు పాట‌ల‌కే శృతి పాత్ర ప‌రిమిత‌మైంది. ఇక వాల్తేరు వీర‌య్య‌లో రా ఏజెంట్ పాత్ర చేసింది. రా ఏజెంట్ అంటే అబ్బో అనుకుంటాం కానీ.. తెర మీద శృతి పాత్ర తుస్సుమంది. మొత్తంగా కేవలం గ్లామర్ షోకు మాత్రమే శృతిని వాడుకున్నారు. అంతకుమించి ఈ చిత్రాల్లో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని సొంత అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. అటు బాల‌య్య‌, ఇటు చిరు ఇద్ద‌రూ శృతిని మోసం చేశారంటూ నెటిజ‌న్లు అభిప్ర‌యాప‌డుతున్నారు.