`క్రాక్` సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఇటీవల `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటిస్తే.. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గోపీచంద్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇంత వరకు తనకు ఏ నిర్మాత కూడా పూర్తిగా డబ్బులు ఇవ్వలేదని, మొదటి సారిగా `వీర సింహా రెడ్డి` సినిమాకే ఫుల్ అమౌంట్ తీసుకున్నానని గోపీచింద్ తెలిపాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తనకు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారన్న విషయాన్ని సైతం పంచుకున్నాడు.
ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ.. `నాకు రవి తేజగారికి పోలికలుంటాయి అని అందరూ అంటుంటారు. కొన్ని షాట్స్ చేసేటప్పుడు రవితేజ అయితే నువ్వు నిలుచో నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లి పోయేవారు. అలానే చిరంజీవిగారు కూడా బక్క రవితేజ అని పిలిచేవారు. ఓసారి షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు నా బర్త్డే వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్ చిరంజీవి వచ్చారు. ఓ వాచ్ తెప్పించి గిఫ్ట్గా ఇచ్చి ఈ రోజు నుంచి నీ టైం మారుతుంది చూడు అన్నారు` అంటూ చెప్పుకొచ్చాడు.