ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న తాజా తమిళ చిత్రం `వరిసు`. తెలుగులో ఈ సినిమాను `వారసుడు` టైటిల్ తో విడుదల చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దళపతి, రష్మిక మందన జంటగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
అయితే మొదట నుంచి ఈ సినిమా చుట్టు వివాదాలు అల్లుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం దిల్ రాజు. తెలుగు రాష్ట్రాల్లో `వారసుడు` కోసం థియేటర్లు అన్నీ బ్లాక్ చేశాడు. చిరంజీవి, బాలయ్య సినిమాలకు థియేటర్లు దక్కకుండా అడ్డుపడుతున్నారు. ఈ విషయంపై పరిశ్రమలో వ్యక్తులు కాదు, సామాన్య ప్రేక్షకులు సైతం దిల్ రాజును ఏకేస్తున్నారు. మరోవైపు తమిళనాట అజిత్ కంటే విజయ్ నెం. 1 స్టార్ అని, అందువల్ల తమ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలంటూ కామెంట్స్ చేయడం పెద్ద దుమారం రేపింది.
ఇక తాజాగా దిల్ రాజు మరోసారి తన నోటి దురుసు చూపించారు. విజయ్ ను లేపడానికి తెలుగు హీరోలను తొక్కేశాడు. తాజా భేటీలో దిల్ రాజు మాట్లాడుతూ.. `నేను విజయ్ దళపతి క్యాబిన్లో వెయిట్ చేస్తున్నాను. క్యాబిన్ లోకి వచ్చిన విజయ్ స్వయంగా తానే మాకు కాఫీ కప్పులు ఇచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ విజువల్ ఇప్పటికీ నా మదిలో ఉంది. తెలుగులో మెగాస్టార్లు, సూపర్స్టార్లతో సినిమాలు చేశాను కానీ అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు` అంటూ చెప్పుకొచ్చారు. అయితే విజయ్ గొప్పతనం గురించి చెప్పొచ్చు.. మధ్యలో మెగాస్టార్లు, సూపర్స్టార్లను తెంచి వారిని తక్కువ చేయడం అవసరమా అంటూ తెలుగు హీరోల ఫ్యాన్స్ దిల్ రాజుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.