మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత తన తదురపి చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో తెరకెక్కబోయే 15వ ప్రాజెక్ట్ ఇది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీకి సుకుమార్ కథనం అందించడం విశేషం.
బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ బయటకు వదిలారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందించిన ఈ గ్లింప్స్ అదిరిపోయిందని చెప్పాలి.
ఈ చిత్రానికి `విరూపాక్ష` అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. తెలియని నిజాన్ని చూపించే మరో నేత్రమే ఈ `విరూపాక్ష` అంటూ టైటిల్ ని రివీల్ చేశారు. గ్రామంలోని క్షుద్ర శక్తులు నేపథ్యంతో మిస్టరీ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. అంతేకాదు, ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.