సాధారణంగా.. ఏ పార్టీలో అయినా..టికెట్ల కోసం పోటీ పడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఒక టికెట్ కు ఇద్దరు ఎప్పుడూ.. పోటీ ఉంటారు. పార్టీ ఏదైనా..టికెట్ కోసం.. ఆశపడుతున్నవారు సహజంగానే పెరు గుతున్నారు. అయితే.. ఒకే ఒక్క సీటు కోసం.. టీడీపీలో మరింత పోటీ పెరిగింది. ఒక్క సీటు కోసం నలుగురు పోటీ పడుతున్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో టికెట్ను తమకంటే.. తమకే ఇవ్వాలని..వారు కోరుతున్నారు. దీంతో టీడీపీ అధినేతకు ఈ టికెట్ పరీక్షగా మారింది.
మరోవైపు అదే టికెట్ కోసం..వైసీపీలో ఒక్కరే పోటీలో ఉండడం గమనార్హం. ఆ నియోజకవర్గమే గుంటూరు వెస్ట్. ఒక సీటు కోసం టీడీపీలో ముగ్గురు, నలుగురు పోటీలో ఉండడం గమనార్హం. 2014 సహా గత 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ విజయం దక్కించుకుంది. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న మద్దాలి గిరి.. వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. దీంతో ఇప్పుడు టీడీపీకి ప్రాతినిధ్యం కరువైంది. అయితే..వచ్చే ఎన్నికల్లోపోటీ చేసేందుకు మాత్రం ఒకరు కాదు..ఏకంగా.. నలుగురు పోటీలో ఉండడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్గా కోవెలమూడి రవీంద్ర(నాని) ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ కావాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు.. ఇదే టికెట్ కోసం మన్నవ మోహన్ కృష్ణ, భాష్యం ప్రవీణ్ కూడా.. ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు ఉంటే కనుక.. దీనిలో భాగంగా తెనాలి స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. జనసేన రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. నాదెండ్ల మనోహర్ అక్కడ నుంచే పోటీ చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం. అయితే.. ఇక్కడ ఎవరు పోటీ చేసినా.. టీడీపీకి ఉన్న బలం.. బలగం నేపథ్యంలో వరుస విజయాలు సాధించిన హిస్టరీ ఉన్న క్రమంలో వారే గెలుపుగుర్రం ఎక్కుతారని మరో ప్రచారం జరుగుతోంది. కానీ, ఎవరికి టికెట్ ఇస్తారనేది మాత్రం ఆసక్తిగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఒక విధమైన స్తబ్దత నెలకొనడంతో కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.