రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాను న్నాయి. సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే.. వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. వైసీపీని ఒంటరిని చేసి. అన్నిపక్షాలు కూటమి కట్టినా.. ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేనంతగా రాజకీయాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవాలి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విషయాలపై సీనియర్లు ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. వీరి అంచనా ప్రకారం.. రాష్ట్రంలోని 175 నియోజవకర్గాల్లో.. వైసీపీ ఖచ్చితంగా 130 చోట్ల గెలుపు గుర్రం ఎక్కుతుందని ఒక లెక్క చెబుతున్నారు.
అంతేకాదు.. ఎలాంటి రాజకీయ పరిణామాలను ఎదుర్కొనైనా.. ఈ 130 మంది నాయకులు విజయం దక్కించుకోవడం ఖాయమని ఒక అంచనాకు సీనియర్లు వచ్చినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ప్రధానంగా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతంగా ఉండడం.. నాయకులపై ప్రజల్లో చెక్కుచెదరని అభిమానం.. వం టివి 130 నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి 2019 ఎన్నికల సమయం లోనూ ఇదే అంకెను వైసీపీ నమ్ముకుంది.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎంత పోటీ ఉన్నా.. 130 సీట్లు తమకు తగ్గవని.. అప్పట్లో జగన్ మీడియాకు చెప్పారు. అయితే..అనూహ్యంగా 151 సీట్లు వచ్చాయి. అయితే.. అప్పుడు ఏ అంచనాతో అయితే.. చెప్పారో..ఇప్పుడు అవే అంచనాలు ఉన్నాయని.. కాబట్టి ఆ 130 మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ జారిపోయే ప్రమాదం లేదని.. అంటున్నారు. అయితే.. ఈ 130 స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని.. చెబుతున్నారు.
అయినప్పటికీ.. నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు, వైసీపీకి కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 130 స్థానాలను నిలబెట్టుకోవడం తథ్యమనే ధీమా అయితే.. వైసీపీ సీనియర్ల మధ్య వ్యక్తమవుతుండడం గమనార్హం.