కంటిన్యూగా మొబైల్ గేమ్.. చివరకు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేక..!

స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పట్నుంచి పిల్లలు,యువత వాటికి బానిసలుగా మారారు. ఇక చిన్న పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తూ మాత్రమే ఆహారం తింటున్నారు. లేకపోతే తినమంటూ మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మొబైల్ లో వీడియోలు చూపిస్తే త్వరగా తింటారని.. పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఇక యువత అయితే పబ్జీ వంటి గేమ్ లకు బానిసలై ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ఆ గేమ్ ను నిషేధించినప్పటికీ అటువంటి గేమ్స్ కొత్తగా మళ్లీ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం జిల్లాలో ఇలాగే 13 ఏళ్ల విద్యార్థి సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతూ బానిసగా మారాడు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుని ఆసుపత్రి పాలయ్యాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు కు చెందిన ఓ విద్యార్థి మూడు నెలల నుంచి ఫోన్ లో గేమ్ ఆడుతూ దానికి బానిసగా మారాడు.

ఇలా ఆడుతూ ఆడుతూ రెండు రోజుల క్రితం స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబీకులు గుర్తించి కర్నూల్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేక పోతున్నాడు. ప్రస్తుతం అతడి నరాలు చిట్లి పోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ బాలుడు కోల్పోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకుండా దూరంగా ఉంచడం ఎంతో మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.