క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే.
అయితే మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇంకా విడుదలకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో.. బన్నీ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే థియేటర్స్ వద్ద తెగ హంగామా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ బాలీవుడ్ మార్కెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, అక్కడ ఆయనకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది.
నిజానికి ‘బాహుబలి1’ కి మించిన క్రేజ్ ను సొంతం చేసుకున్న ‘పుష్ప’.. హిందీ లో 10 కోట్ల వరకు బిజినెస్ చేసింది. హిందీ లో ఫస్ట్ అటెంప్ట్ తోనే ఈ రేంజ్ బిజినెస్ ను సాధించడం విశేషమే. కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్ బుక్కింగ్స్ విషయానికి వస్తే చాలా డల్గా ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు సుమిత్ కడేల్ ‘పుష్ప’ హిందీ ఓపెనింగ్స్ 50 లక్షల నుండి 1.50 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేశారు.
అయితే నేడు విడుదల కాబోయే హాలీవుడ్ చిత్రం `స్పైడర్ మ్యాన్` ప్రభావం కారణంగా పుష్ప ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయని అంటున్నారు. మరి హిందీ లో ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, ఈ పాన్ ఇండియా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు.