ప్ర‌భాస్ కోసం హోస్ట్‌గా మారుతున్న క్రేజీ హీరో.. ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. 1970లో యూరప్‌ నేపథ్యంగా సాగే వింటేజ్‌ ప్రేమకథా చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌.. డిసెంబర్‌ 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్‌ సిటీలో సాయంత్రం 6 గంటలకి అట్ట‌హాసంగా రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ వేడుకకు ప్రభాస్ అభిమానులే అతిథులుగా హాజరుకానున్నారు. ఐదు భాషలకు సంబంధించిన ట్రైలర్స్‌ను స్వ‌యంగా ఫ్యాన్సే విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ప్ర‌భాస్ కోసం రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ క్రేజీ హీరో నవీన్‌ పోలిశెట్టి హోస్ట్ మార‌బోతున్నాడ‌ట‌.దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైర‌ల్‌గా మారింది. మ‌రి ఇదే నిజ‌మేతే.. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

కాగా, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ పెద‌నాన్న, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఆధ్యాత్మిక గురువు పరమహంస పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.