అరె సార్.. జర మాట్లాడరాదె..

వరి కొనుగోలు సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ అయిన సీఎం కేసీఆర్.. గంటలకొద్దీ వరుస ప్రెస్ మీట్లు.. ఇక్కడ బండి సంజయ్ మొదలు ఢిల్లీలో మోదీ మీద వరకు విమర్శలు.. కేంద్రం ఏం చేస్తలేదు.. బండి సంజయ్ నాటకాలాడుతున్నాడు.. అంటూ డైలాగుల మీద డైలాగులు.. మీరు కొంటరా..కొనరా చెప్పాలని డిమాండ్.. ఇక ఇందిరా పార్కులో ధర్నా.. కేంద్రం చెప్పి తీరాలె.. లేకపోతే ఢిల్లీ బోతం.. మెడలు వంచుతాం అంటూ ఆవేశపూరిత ప్రసంగం.. చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్లడం.. అక్కడ నాలుగు రోజులు గడపడం.. తరువాత ఫ్లైట్ ఎక్కి సిటీకి రావడం..చక చకా జరిగిపోయాయి. ఈ వారం, పది రోజుల్లో ఇదీ జరిగింది. మరి ఇప్పుడేం జరుగుతోంది. సారెందుకు సైలెంటైండు.. ఢిల్లీ పోతం.. నిలదీస్తం.. అని గట్టిగా చెప్పి పొయినారుగదా.. అక్కడేం జరిగింది.. గిప్పుడేమైంది జనాలకు చెప్పాల కదా?

ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇన్ని రోజులైనా ఇంకా జనాలకు చెప్పకపోతే ఎట్ల? అంతకుముందేమో గంటలకొద్దీ మాట్లాడి ఇపుడు మౌనంగా ఉంటే దానర్థం ఏమని. ఏదో ఒకటి రైతులకు చెప్పాలి కదా? ఓకే కేంద్రం కొనబోము అని నిన్న రాష్ట్ర మంత్రులకు చెప్పిందని టీవీల్లో వచ్చింది. కనీసం ఆ తరువాతైనా మాట్లాడి రైతుకు భరోసా, ధైర్యం చెప్పకుండా మీరే దిగాలుగా ఉంటే ఎట్ల సారూ.. రండి బయటకు.. వచ్చి మాట్లాడండి.. ఇదే జనం కోరుకునేది. మీరు ఏదో ఒకటి చెప్పకుండా ఉంటారా అని టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్, రైతులు, ప్రజలు, మీడియా వాళ్లు ప్రగతి భవన్ వైపు చూస్తున్నారు. మీరేమో.. సైలెంటైపోతిరి.. ఎట్ల సారూ..