వీరమల్లుకు ఎసరుపెట్టిన భీమ్లా నాయక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీలను కూడా వరుసబెట్టి పట్టాలెక్కిస్తున్నాడు పవన్.

ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా ఆలస్యంగా సాగుతోంది. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. తిరిగి మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని చూసినా, పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ తొలి వారం నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.

అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రాన్ని పూర్తి చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో, మళ్లీ హరిహరవీరమల్లు చిత్ర షూటింగ్‌ను వాయిదా వేయాలని చిత్ర యూనిట్‌ను కోరాడట. దీంతో క్రిష్ అండ్ టీమ్ కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్లీ వాయిదా పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ భీమ్లా నాయక్ చిత్ర రిలీజ్ తరువాతే తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుండగా, ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్ నటిస్తున్నారు. మరి క్రిష్ ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడా, ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.