మీ ప్రార్థనలే నన్ను బతికించాయి.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండు నెలల కిందట జరిగిన బైక్ యాక్సిడెంట్ తో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలకు సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత సాయి తేజ్ కనిపించడం అదే మొదటిసారి. కాగా సాయి తేజ్ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో సాయి ధరంతేజ్ పాల్గొంటారని కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ప్రమాదం జరిగిన తర్వాత సాయిధరమ్ తేజ్ మొదటిసారి బయట కనిపించే కార్యక్రమం ఇదే అని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో రిపబ్లిక్ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ కి సాయి తేజ్ వస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు.

రిపబ్లిక్ సినిమా ఓటీటీలో విడుదల అవుతున్న సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. ‘హాయ్ నేను మీ సాయి ధరమ్ తేజ్. నా పై, నా సినిమాల పై మీరు చూపిన ప్రేమ, అభిమానం చాలా గొప్పవి. నాకు ప్రమాదం జరిగినప్పుడు మీరు చేసిన ప్రార్థనలే నన్ను బతికించాయి. మీకు అందరికీ కృతజ్ఞతలు. రిపబ్లిక్ సినిమాను అందరితో కలసి చూద్దాం అనుకున్నా.కానీ కుదరలేదు. ఈ సినిమా జీ5 ఓటీటీలో నవంబర్ 26 నుంచి స్ట్రీమ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. జై హింద్.’ అని సాయి ధరమ్ తేజ్ వాయిస్ మెసేజ్ లో పేర్కొన్నారు.