సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో బాగా బిజీ అయ్యారు. రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసి పరాజయం మూటగట్టుకున్న తరువాత ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈటల అనంతరం తన వద్దే ఉంచుకున్న వైద్య ఆరోగ్య శాఖను అల్లుడు హరీశ్ కు అప్పగించడమే నిదర్శనం. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు ఏకంగా కేసీఆర్ కుటుంబాన్నే టార్గెట్ చేశారు. హుజూరాబాద్ లో ఈటల గెలవడంతో బీజేపీ జోష్ లోఉంది. ఇక పుండు మీద కారం చల్లినట్లు.. వరి కొనుగోలు సమస్య వచ్చి పడింది. ఈ ఇష్యూను బండి సంజయ్ అండ్ టీమ్ లీడ్ చేయడం ప్రారంభించడంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. తప్పు మాది కాదు.. మీదేనంటూ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఇందిరాపార్కు వేదికగా ధర్నాకు దిగారు. కేంద్రం కొంటదా.. కొనదా చెప్పాలని డిమాండ్ చేశారు. తన టీమ్ తో ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కలిసి సమస్యను వివరించాలని నిర్ణయించారు. ఇలా వరి సమస్య కేసీఆర్ ను నిద్రపోనీయడం లేదు.

ఎమ్మెల్సీ ఎన్నికలు మరోవైపు..

ఈ వరి కొనుగోలు సమస్య ఇలా ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులను ఎంపిక చేసిన అనంతరం స్థానిక సంస్థల కోటాలో నోటిఫికేషన్ వచ్చింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులు ఎలాగైనా విజయం సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు.. స్థానిక కోటాలో కూడా టీఆర్ఎస్ దే పైచేయి అవుతుంది.. కానీ అభ్యర్థుల ఎంపిక మాత్రం కత్తిమీద సామే.. అందుకే ఏ ఇబ్బందీ లేకుండా అందరు సిట్టింగులకే టికెట్లు ఇచ్చేద్దామని అధినేత భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీని కాదని వేరేవాళ్లకు ఇస్తే ఇప్పుడున్న తలనొప్పికి వేరే ప్రాబ్లం వస్తుంది.. అందుకే సిట్టింగ్ వైపు మొగ్గు చూపారు. గెలుపు బాధ్యతలు మాత్రం పార్టీ నాయకులకు అప్పగించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడిపోవద్దని.. అన్ని సీట్లూ గెలవాలని దిశానిర్దేశం చేశారు.