ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రంతో పాటుగా మెహర్ రమేష్తో `భోళ శంకర్`, బాబితో ఓ చిత్రం చేయనున్నాడు. త్వరలోనే ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్పైకి వెళ్లబోతున్నాయి.
అయితే ఇలాంటి తరుణంలో చిరంజీవి తీసుకున్న ఓ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ను షాక్ అయ్యేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాను ఒప్పుకున్న చిత్రాలు ఇంకా పూర్తి కాకుండానే చిరంజీవి మరో డైరెక్టర్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఒకప్పటి అగ్ర దర్శకుడు కృష్ణవంశీ. ప్రస్తుతం ఈయన `రంగ మార్తాండ` అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి చిరు డబ్బింగ్ చెప్పారు.
ఆ సమయంలోనే కృష్ణవంశీ చిరుకి కథ చెప్పి ఒప్పించాడని ప్రచారం జరుగుతోంది. ఇక గతంలో కృష్ణవంశీ .. చిరంజీవి కోసం ‘వందేమాతరం’ అనే స్క్రిప్ట్ను రెడీ చేసారు. కానీ, అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల చిరు ఆ సినిమాను చేయలేకపోయడు. అయితే ఇప్పుడు ఆ కథనే మార్పులు చేర్పులు చేసి వినిపించగా.. చిరంజీవికి నచ్చి ఓకే చెప్పాడని అంటున్నారు. మరోవైపు ఈ విషయం మెగా అభిమానులను తెగ కలవర పెడుతోంది. ఎందుకంటే, కృష్ణవంశీ గత కొంత కాలం నుంచీ సరైన హిట్టే అందుకోలేదు. అటువంటి ఆయనకు చిరు ఛాన్స్ ఇవ్వడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.