దివంగత మాజీ మంత్రి, ఏపీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన ఆయన రాజకీయ జీవితంలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. కోడెల అంటేనే గుంటూరు జిల్లాలో ఓ ఫైర్ బ్రాండ్. హోం మంత్రిగానే కాకుండా రాష్ట్ర విభజన జరిగాక నవ్యాంధ్ర తొలిస్పీకర్గా కూడా తనదైన ముద్రవేశారు. ఆయనకు ఉన్న పేరును చివర్లో ఆయన కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరాం ఇద్దరూ తీసేశారు. ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుమారుడు, కుమార్తె ఇద్దరూ పోటీపడి అవినీతి చేశారు. జనాల దగ్గరు డబ్బులు పీకేయడంలో ఒకరిని మించి మరోకరు పోటీ పడ్డారు. ఈ విషయంలో వారిని కోడెల కంట్రోల్ చేయలేకపోయారు. చివరకు ఆయన ఓడిపోయాక జగన్ ప్రభుత్వం హయాంలో ఆ ఫ్యామిలీ చేసిన అవినీతి, అక్రమాలపై కేసులు నమోదు చేస్తుండడంతో మానసికంగా కృంగిపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
కోడెల అధికారంలో ఉండగా ఆయన వారసుడు శివరాం చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు సత్తెనపల్లిలో తోపుడు బండ్ల మీద చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూడా కే ట్యాక్స్ ( కోడెల శివరాం ట్యాక్స్గా అప్పట్లో ప్రసిద్ధి ) వసూలు చేశారంటే ఎంత దారుణంగా వ్యవహరించారో అర్థమవుతోంది. సత్తెనపల్లిలో ఎవరైనా వెంచర్ వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా ముందు శివరాంను కలవాల్సిందే.. కే ట్యాక్స్ సమర్పించుకోవాల్సిందే అన్న ఆరోపణలు అప్పట్లో తీవ్రంగా వచ్చాయి. కొడుకు చేసిన పనితోనే కోడెల పరువు అంతా పోయింది. ఈ ప్రభావం తీవ్రంగా పడడంతోనే స్పీకర్గా ఉండి కూడా కోడెల గత ఎన్నికల్లో అంబటి రాంబాబు చేతిలో 19 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. కోడెల కెరీర్ చరమాంక దశలో ఈ ఘోర ఓటమి జీర్ణించుకోలేనిదే అని చెప్పాలి.
పైగా గత టర్మ్లో ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇటు సత్తెనపల్లితో పాటు అటు నరసారావుపేటలోనూ కోడెల వారసుల దందాలు సాగాయన్న ప్రచారం తెలిసిందే. అసలు టిక్కెట్ వస్తుందో ? రాదా ? అన్న డైలమాలో ఉన్న అంబటిని గెలిపించింది ఖచ్చితంగా శివరాం ఆరాచకాలు, దందాలే అని కూడా అక్కడ టీడీపీ నేతలు చెపుతూ ఉంటారు. గత ఎన్నికలకు ముందు కోడెల శివరాం దెబ్బకు తట్టుకోలేక సొంత పార్టీ నేతలే కోడెల శివప్రసాదరావుకు సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు.
శివరాం కొత్త నటన ?
తండ్రి మరణం తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉన్న శివరాం ఇప్పుడిప్పుడే సత్తెనపల్లి నియోజకవర్గంలో యాక్టివ్ అవుతున్నారు. పార్టీ కేడర్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పరామర్శలు, పర్యటనలు చేస్తున్నారు. అయితే అక్కడ పార్టీ కేడర్లో చాలా మంది శివరాం మాకు వద్దే వద్దు అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతెందుకు ఇటీవల కోడెల స్వగ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ జరిగితే రాష్ట్ర నాయకులనే రావొద్దని అక్కడ నేతలు కండీషన్లు పెట్టారంటే శివరాంను అక్కడ కేడర్ ఎంతలా వ్యతిరేకిస్తుందో ? అర్థమవుతోంది.
ఇక వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి టిక్కెట్ టార్గెట్గా శివరాం అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. తనతో కలిసి వచ్చే ఒకరిద్దరు నేతలను వెంటేసుకుని ఆయన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అయితే అక్కడ పార్టీ నేతలు మాత్రం శివరాంను ఏ మాత్రం నమ్మే పరిస్థితి లేదని చెపుతున్నారు. రేపటి రోజు శివరాంకు టిక్కెట్ వచ్చి గెలిస్తే.. అప్పుడు వసూళ్లలో విశ్వరూపం చూపించి విజృంభిస్తాడని.. సొంత పార్టీ నేతలతోనే మరో ఐదేళ్ల పాటు కే ట్యాక్స్ కట్టించేసుకుంటాడని వారు గగ్గోలు పెడుతున్నారు. శివరాం కేవలం సీటు కోసమే ఈ న్యూ పాలి ట్రిక్స్ చేస్తున్నాడని కూడా సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.