నందమూరి బాలకృష్ణ రిల్ హీరోనే కాదు రియల్ హీరో అని కూడా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయని బాలయ్య.. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే 7 ఏడేళ్ల పాప కేన్సర్ బారిన పడి బసవతారకం హాస్పిటల్ లో చేరింది.
హాస్పిటల్లో ఆ పాప ఆపరేషన్ కి 7 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయంతో లక్షా 80 వేల వరకూ సేకరించగా.. ఇంకా 5 లక్షల 20 వేల రూపాయలు తక్కువ అయ్యాయి. ఈ క్రమంలోనే మణిశ్రీ తల్లిదండ్రులు బాలకృష్ణ అభిమాని సంఘం అధ్యక్షుడిని కలిసి పరిస్థితిని వివరించగా.. ఆయన ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు.
దాంతో వెంటనే స్పందించిన బాలయ్య చిన్నారి ఆపరేషన్ కు కట్టాల్సిన 5 లక్షల 20 వేల రూపాయలు మాఫీ చేయించారు. అంతేకాదు చిన్నారికి తగిన చికిత్స అందించమని వైద్య సిబ్బందికి చెప్పారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరియు నెటిజన్లు బాలయ్య సూపర్, డూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.