నాన్వెజ్ ప్రియులకు ఇది శుభవార్తే. ఏపీలో మటన్ మార్ట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ మటన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.
మటన్ మార్ట్గా పిలిచే ఈ మొబైల్ దుకాణం వాహనమే. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్ మటన్ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్ చేశారు. ఈ వాహనాన్ని కనీసం పది మేకలు, గొర్రెలను వధించేందుకు వీలుగా వధశాలతో పాటు డ్రెస్సింగ్, జీవాల అవయవాల వారీగా కటింగ్, డ్రెస్సింగ్, ప్యాకేజింగ్, రిటైల్ విక్రయాలు జరిపేందుకు వీలుగా రూపొందించారు.
ప్రాసెసింగ్ చేసిన మాంసాన్ని నిల్వ చేసేందుకు రిఫ్రిజరేటర్లు ఇందులో ఉంటాయి. మరియు వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేందుకు వాహనంలోనే డంపింగ్ సౌకర్యం సైతం ఉంటుంది. ఇక ఈ మటన్ మార్ట్లను తొలిదశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటు చేయనుండగా.. అక్కడ సక్సెస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తారు. రూ.11.20 కోట్లతో 112 మార్ట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.