కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ.. ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల మధ్య పెద్ద సినిమాలేవి విడుదలకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు తప్పక, పరిస్థితులు అనుకూలించక ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ లిస్ట్లో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన `టక్ జగదీష్` చిత్రం కూడా చేరిపోయింది.
నిజానికి నాని మొదటి నుంచీ థియేటర్లోనే రావాలని కోరుకున్నాడు. కానీ, ఏపీలో పూర్తిగా థియేటర్లు తెరుచుకోలేదు. పైగా థియేటర్లు, టికెట్ రేట్లు పట్ల అక్కడున్న నిబంధనలు నిర్మాతలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ కారణంగా టక్ జగదీష్ ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ విషయంలో నాని ఎంతో బాధ పడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో నానికి మరో తల నొప్పి మొదలైంది.
నాని నటిస్తున్న మరో చిత్రం `శ్యామ్ సింగ రాయ్`కి కూడా ఓటిటి డీల్ కుదిరిందని.. ఈ చిత్రాన్ని కూడా త్వరలోనే ఓటిటిలో రిలీజ్ చేయనున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ను వైరల్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రముఖ ఓటిటి సంస్థ ఈ చిత్రాన్ని రూ. 40 కోట్లకు కొనుగోలు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ ఫేక్ ప్రచారాన్ని సహించలేకపోయిన శ్యామ్ సింగ రాయ్ మేకర్స్ స్వయంగా రంగంలోకి దిగి.. ఆ వార్తలన్నీ అవాస్తమే అని తేల్చి చెప్పారు.