రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!

బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం పెంచారు. అంతేకాకుండా రిజి స్ట్రేషన్ల ధరలను కూడా పెంచింది. ఈ నిర్ణయాన్ని విజయశాంతి తన ట్విట్టర్లో సమర్థించింది.

భూముల విలువ పెంచడం సమర్థనీయమే.. అయితే రిజి స్ట్రేషన్ల ధరలను పెంచడం మాత్రం సమర్థనీయం కాదు అని అభిప్రాయం వ్యక్తం చేసింది. అంటే.. కేసీఆర్ నిర్ణయాన్ని రాములమ్మ సమర్థించినట్లే కదా! ఎప్పుడూ ఉప్పు..నిప్పులా ఉండే కమలం, గులాబి పార్టీల నాయకులు ఈ సీనియర్ బీజేపీ నాయకురాలు చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి కోకాపేట భూముల వేలం వ్యవహారంపై బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని విమర్శిస్తున్న సందర్భంలో విజయశాంతి అభిప్రాయం బీజేపీ పెద్దలను ఆగ్రహానికి గురిచేస్తున్నట్లు తెలిసింది.