బెజవాడ ‘దేశం’లో నాలుగు స్తంభాలాట…. !

బెజవాడ.. విజయవాడ.. పేరేదైనా సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువు.. అధికార పార్టీలో కాదు గానీ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నిప్పు..ఉప్పులా ఉంటున్నారు బెజవాడ నాయకులు. గతంలో విజయవాడ దేశం నాయకులు బలంగా ఉండేవారు. అయితే ఇపుడా పరిస్థితి లేదు. అర్బన్ నాయకులు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగామారారు. దీంతో ఎవరికి ఏం చెప్పాలో అధినేతకు అర్థం కాక అలా వదిలేశాడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నలుగురు నాయకులు నాలుగు దిక్కులుగా వ్యవహరిస్తున్నారు.  ఎంపీ కేసినేని నాని, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, షేక్ నాగుల్ మీరాలు గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారు. ఒకరికొకరు రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ పాలిట్రిక్స్ చేస్తున్నారు. దీంతో కార్యకర్తలకు ఏం చేయాలో దిక్కతోచక బిక్కమొహం వేస్తున్నారు.

విచిత్రమేమంటే 2019 ఎన్నికలకు ముందు  ఈ నలుగురూ చాలా క్లోజ్ గా ఉండేవారు. నలుగురిదీ ఒకే మాట.. బాట.. అయితే ఇపుడు ఆ పరిస్థితి లేదు. మొదట్లో నాని, వెంకన్న మధ్య వార్ నడిచింది. ఎంతలా అంటే సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ తిట్టుకునేంత.. ఆ తరువాత నానికి, బోండ ఉమకు చెడింది. నాని ఇంకా ముందుకు వెళ్లి రాజకీయంగా తన కూతురును ప్రొజెక్ట్ చేస్తున్నాడు. వచ్చే వీఎంసీ ఎన్నికల్లో కూతురును మేయర్ అభ్యర్థిగా నిలబెట్టాలని నాని ఆలోచన అని తెలిసింది. దీంతో ఇది నాగుల్ మీరకు నచ్చడం లేదు. ఈ వ్యవహారాలు చక్కదిద్దడానికి లోకేష్ రంగంలోకి దిగాడు. అయితే అది అతనికి సాధ్యం కాలేదు. దీంతో నాలుగు స్తంభాలాట ఇంకా కొనసాగుతోంది.  చివరకు పార్టీ అధినేత చంద్రబాబు జోక్యం చేసుకుంటారేమో. . మరి..!