భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 4 (రేపు) టీఆర్ఎస్ పార్టీతోపాటు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక 8 లేదంటే 9వ తేదీల్లో ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల..సోమవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్, మాజీ ఎంపీ జి.వివేక్ సమక్షంలో బీజేపీ చీఫ్ను కలిసిన ఆయన..తాను బీజేపీలో చేరేందుకు ప్రేరేపించిన పరిస్థితులను వివరించినట్లు తెలిసంది.
ఇక ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకొని ఈటల నేడు హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటించేందుకు గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.