టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా కనిపించనున్నాడు. అయితే గత రెండు రోజులుగా ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫస్ట్ పార్ట్, వచ్చే ఏడాది సెకెండ్ పార్ట్ విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలనే నిజం చేస్తూ బన్నీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు పుష్ప మేకర్స్. ఎంతో స్పాన్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అటువంటి కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మేం కలసి రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకొన్నాం. ఫస్ట్ పార్ట్ పూర్తి కాగానే రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేస్తాం అని పుష్ప నిర్మాతల్లో ఒకరు తాజాగా మీడియాకు వెల్లడించారు.