ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) కరోనాతో మరణించడాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షో ద్వారా ఎంతో మంది అగ్ర దర్శకులను, నటీనటులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారీయన.
పేరునే బ్రాండ్గా మార్చుకొని సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలడిగేవారు టీఎన్ఆర్. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఇంట్రస్ట్ చూపేవారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులతో ఏకంగా నాలుగు గంటల పాటు సుధీర్గంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత కూడా టీఎన్ఆర్దే.
అంతేకాదు, తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్లలో ఈయన కూడా ఒకరు. షో నిడివిని బట్టి ఒక్కొక్క ఇంటర్య్వూకు దాదాపు లక్ష రూపాయల నుంచి ఆపైనే ఛార్జ్ చేసేవారట. ఇక ఇప్పటి వరకు దాదాపు 189 ఇంటర్వ్యూలు చేసిన టీఎన్ఆర్ నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించారు.