కరోనా వైరస్ మళ్లీ విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్లో ఊహించని స్థాయిలో విజృంభిస్తున్న కరోనా ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. మరెందరో ప్రాణాలతో పోరాడుతున్నారు. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ లాక్డౌన్ పెట్టనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈనెల 30(నేడు) తరువాత లాక్డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కరోనా కట్టడి కోసం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ కూడా నేటితో పూర్తి కానుంది. దీంతో సీఎం కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం..అన్ని అంశాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈవేళ అధికార ప్రకటన కూడా రానుందని సమాచారం. కాగా, ఇప్పటికే లాక్డౌన్ వార్తలను వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కొట్టిపారేశారు.