ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మిత్రుల మధ్య కలహాలు.. కొత్త పొత్తులు, వ్యూహాలతో రాజకీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తోందని మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు చూచాయగా ఒప్పుకున్నట్లు ఆసక్తికర కథనం చక్కెర్లు కొడుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడం.. ఇప్పుడు టీడీపీకి మింగుడుపడని అంశంగా మారింది. ప్రతిపక్ష వైసీపీతో బీజేపీ సత్సంబంధాలు కొనసాగిస్తోందనే మాటలకు బలం చేకూరిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అనూహ్యంగా ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి వచ్చారు వైసీపీ అధినేత జగన్. మిర్చిరైతులు, వ్యవసాయ సమస్యలు, ప్రత్యేక హౌదా వంటి అంశాలపై కలిసేందుకు ఆయన ప్రధానిని కలిశారని జగన్కు చెందిన మీడియా చెబుతున్నా.. ఇతర ఛానళ్లు అసలు సంగతి వెల్లడించాయి. దీనిని ప్రచారం చేయడంలో ఇతర మీడియా సంస్థలు వ్యత్యాసాన్ని చూపాయి. బీజేపీకి మద్దతునిస్తామని జగన్ స్పష్టంగా చెప్పారని ఒక మీడియా చెబితే.. టీఆర్ఎస్, అన్నాడీఎంకె మద్దతు ఇప్పటికే లభించింది గనక వైసీపీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనని వ్యాఖ్యానం జోడించింది. ఈడీ కేసుల నేపథ్యంలో రాజకీయ భవితవ్యం గురించి భయాందోళనలో వున్న జగన్ రహస్యంగా మోడీని కలిశారని మరో మీడియా తెలిపింది.
మరో వైపు జగన్ అనుకూల సోషల్మీడియా సైట్లు ప్రధానితో ఆయన భేటీ తెలుగుదేశానికి చెంపపెట్టు అంటూ వ్యాఖ్యలు పోస్టు చేశాయి. అరుదుగానే అపాయింట్మెంట్లు ఇచ్చే మోడీ.. జగన్కు సమయం కేటాయించడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ నేరుగా బీజేపీకి రాజకీయ మద్దతు నివ్వడం కూడా కొత్త పరిణామమే. తెలుగుదేశం దీన్ని జీర్ణించుకోవడం కష్టమే. ఇదే సమయంలోనే లోకేశ్.. గన్నవరంలో మాట్లాడుతూ కేంద్రం నుం చి తాము బయటకు రావాలనుకుంటే నిమిషంలో పని అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు వారితో కలసి ఉంటున్నారని వివరించారు.
రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరిస్తే బీజేపీకి మద్దతు నివ్వడానికి అభ్యంతరం లేనట్టు వైసీపీ అధినేత కూడా మాట్లాడాలరని మీడియా కథనాల సారాంశం. మరి ఈ పరిణామాలన్నీ దేనికి దారితీస్తాయో వేచిచూడాల్సిందే! ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఎన్నికలకు ముందే పొత్తులపై పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి!!