విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎంపీలంతా ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే దీని నుంచి అర్ధంతరంగా బయటికొచ్చిన ఎంపీ రాయపాటి సాంబశివరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎన్నిసార్లు భేటీ అవుతున్నా జోన్ ఎందుకు రావడం లేదని ఘాటుగానే ప్రశ్నించారు. అయితే చంద్రబాబుపై ఇంతలా ఆగ్రహం వ్యక్తంచేయడం వెనుక కారణం కూడా లేకపోలేదట. అదే టీటీడీ చైర్మన్! ఈ పోస్టుకీ, రైల్వేజోన్ గురించి చంద్రబాబుపై ఆగ్రహానికి లింక్ కూడా లేకపోలేదట.
తాను మాట్లాడితే సీఎం చంద్రబాబుకి కోపం వస్తుందని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. సీఎంకి కోపం తెప్పించే అంశం అని తెలిసినా కూడా మాట్లాడటం తప్పడం లేదంటూనే విశాఖ రైల్వే జోన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ మధ్య రైల్వేజోన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో జరిగిన సమావేశం నుంచి ఆయన అర్ధంతరంగా బయటకి వచ్చేశారు. అనంతరం తన ఆవేదనను వెళ్లగక్కారు. ఈ అంశంపై ముఖ్యమంత్రిగానీ ఇతర టీడీపీ నాయకులుగానీ శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. అంతేకాదు, ఇలాగే ఇంకొన్నాళ్లు గడిస్తే రైల్వే జోన్ అంశాన్ని ప్రజలు మెల్లగా మరచిపోతారని రాయపాటి అభిప్రాయపడ్డారు.
జోన్ రాకపోవడానికి కారణం అధికారుల తీరే అన్నారు. చిన్నచిన్న పనులు కూడా అధికారుల చేయడం లేదనీ, విశాఖ జోన్ రావడం వారికి ఇష్టం లేదనీ, వారికే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే అది సాకారమయ్యేదనీ అన్నారు. సాక్షాత్తూ రైల్వే మంత్రే ఆంధ్రా కోటాలో ఎంపీ అయ్యారు. అయినా గడచిన బడ్జెట్ లో విశాఖ జోన్ ఊసెత్తలేదు. దాని గురించి చంద్రబాబు సర్కారూ భాజపాని ప్రశ్నించలేదు! మరి ఇలాంటి అంశంపై మాట్లాడితే చంద్రబాబుకు కోపం రావడం సహజమే! అయినా ఎందుకు రాయపాటి మాట్లాడారంటే.. అసంతృప్తే కారణమట.
టీటీడీ ఛైర్మన్ పదవి తనకే దక్కాలని రాయపాటి పట్టుబడుతున్నారు. కానీ చంద్రబాబు మనసులో మరో ఎంపీ మురళీమోహన్ ఉన్నారట అని కూడా టీడీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. టీడీపీకి తాను ఎంతో చేదోడు వాదోడుగా నిలిచినా కూడా టీటీడీ ఛైర్మన్ పదవి విషయమై తన గురించి ఎందుకు ఆలోచించడం లేదన్న అసంతృప్తి రాయపాటిలో ఉందని, ఆ వర్గం నుంచే గుసగుసలు వినిపించాయి. దీనిపై అసంతృప్తి బ్యాక్ మైండ్ లో ఉంచుకునే ఈ సందర్భాన్ని, రైల్వే జోన్ హామీని ఇలా రాయపాటి వాడుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవ్వక తప్పదు.