ప్ర‌జాక్షేత్రంలోకి జనసేన .. చివ‌రి రోజున ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జాక్షేత్రంలోకి దూక‌నున్నాడు. ఈ క్ర‌మంలోనే వివిధ జిల్లాల్లో స‌మ‌స్య‌ల‌తో పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే నాలుగైదు స‌భ‌లు పెట్టిన ప‌వ‌న్ ఇక ఇప్పుడు సీమలో క‌రువు ప్రాంత‌మైన అనంత‌పురం జిల్లా మీద త‌న ఫోక‌స్ పెట్టాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఇదే జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో ఈ జిల్లా మీద రోజు రోజుకు ప‌వ‌న్ కేంద్రీక‌ర‌ణ పెరుగుతోంది.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అనంత‌పురం జిల్లాలోని అనంత‌పురం – గుంత‌క‌ల్‌- క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఓ చోట‌నుంచి పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే జిల్లా వాసుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ప‌వ‌న్ పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ప‌వ‌న్ గ‌తంలో అనంత‌పురం జిల్లాలో పెట్టిన స‌భ‌లో జిల్లా ప‌రిస్థితులు తెలుసుకునేందుకు పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇక జిల్లాలో జ‌న‌సేన‌ను బ‌లోపేతం చేయ‌డంతో పాటు తాను ఇక్క‌డి నుంచి బ‌రిలోకి ఉంటాన‌ని చెప్ప‌డంతో ప‌వ‌న్ పాద‌యాత్ర ద్వారా జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ప్లాన్లు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ పాద‌యాత్ర జిల్లాలోని క‌ళ్యాణ‌దుర్గం నుంచి స్టార్ట్ అయ్యి మ‌డ‌క‌శిర‌, పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు గోరంట్ల‌, పుట్ట‌ప‌ర్తి, ధ‌ర్మ‌వ‌రం, అనంత‌పురం వ‌ర‌కు సాగుతుంద‌ని తెలుస్తోంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ పాద‌యాత్ర ఉంటుంద‌ని….చివ‌రి రోజున అనంత‌పురంలో ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని తెలుస్తోంది.

తాజాగా కాట‌మ‌రాయుడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ ఏప్రిల్ 6నుంచి త్రివిక్ర‌మ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన వెంట‌నే ఈ పాద‌యాత్ర డేట్లు ఫిక్స్ అవుతాయ‌ని తెలుస్తోంది.