ఏపీలో కేబినెట్ ప్రక్షాళన వార్తలు గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రకాక్షళనలో ఆశావాహుల లెక్కలు భారీగానే ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, సీనియర్లు, జంపింగ్ జపాంగ్లు, ఎమ్మెల్సీలు ఇలా ఎవరికి వారు తమకు కేబినెట్లో బెర్త్ ఖాయమని ఆశల్లో మునిగి తేలుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్కు ఫస్ట్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు రెండో ప్రయారిటీ ఉంటుంది. మిగిలిన బెర్తులు ఎవరికి దక్కుతాయన్నది మాత్రం అప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సైతం కేబినెట్ బెర్తు కోసం సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లపాటు తాను ఎంతో కష్టపడ్డానని ఇప్పుడు తనకు కేబినెట్ బెర్త్ ఇవ్వకపోతే తాను పడిన కష్టానికి ఉపయోగం లేదని పయ్యావుల బాబు వద్ద ఇప్పటికే చాలాసార్లు వాపోయాడట. ఇక బయట కూడా పయ్యావుల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తాను కావాలి…ఇప్పుడు బుగ్గకారులో తిరిగే అదృష్టం తమకు ఉండదా ? అని సన్నిహితుల వద్ద వాపోతున్నారట.
ఇదిలా ఉంటే పయ్యావులకు బెర్త్ ఇవ్వాలంటే అదే జిల్లా నుంచి పయ్యావుల సామాజికవర్గానికే చెందిన పరిటాల సునీతను తప్పించాలి. పరిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్, వారు పార్టీ కోసం చేసిన త్యాగాల దృష్ట్యా సునీతను తప్పించే సాహసం బాబు చేస్తారా ? అంటే చెప్పలేని పరిస్థితి. ఇక బాబు బావమరిది, అనంతపురం జిల్లాకే చెందిన ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం సునీతకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. సునీతను కొనసాగించాల్సిందే అని బాబుకు, లోకేశ్కు చెప్పేశారట. దీంతో బాబు సైతం పయ్యావులను కేబినెట్లోకి తీసుకునే విషయంలో డైలమాలో ఉన్నారు.