త‌మిళ అసెంబ్లీ సాక్షిగా ఓడిన ముగ్గురు

త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం ప‌ళ‌నిస్వామి బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గుతారా ? లేదా ? అన్న ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఈ రోజు జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో పళనిస్వామి రాజకీయ చతురత ముందు మరోసారి పన్నీరు సెల్వం, డీఎంకే బొక్కబోర్లపడ్డాయి. త‌మిళ అసెంబ్లీలో కురుక్షేత్రాన్ని త‌ల‌పించేలా జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలో సీఎం పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. వ్యతిరేకంగా 11 వ్యతిరేక ఓట్లుపడ్డాయి.

ఇక ఈ బ‌ల‌ప‌రీక్ష‌లో పైకి ప‌న్నీరు సెల్వం ఓడిన‌ట్లు క‌నిపిస్తున్నా ఓవ‌రాల్‌గా మాత్రం ముగ్గురికి ఘోర‌ప‌రాజ‌యం జ‌రిగిన‌ట్టుగా రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముందుగా ప‌న్నీరుసెల్వం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెర వెన‌క ఎన్నో స్కెచ్‌లు వేసింది. ఈ పోటీలో పైకి ప‌న్నీరుసెల్వం క‌నిపిస్తూ ఓడినా క‌నిపించ‌కుండా ఓడింది మాత్రం బీజేపీనే అన్న చ‌ర్చ‌లు దేశ‌వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

ఇక డీఎంకే అధినేత స్టాలిన్ సైతం అస‌మ‌ర్థ ప్ర‌ణాళిక‌తో ప్లాప్ షో వేశార‌న్న విమ‌ర్శ‌లు విన‌వ‌స్తున్నాయి. ఇక సీఎంగా బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన ప‌ళ‌నిస్వామి అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. 31మంది మంత్రి పదువులిచ్చారు. అవిశ్వాస తీర్మానానికి గ‌వ‌ర్న‌ర్ 15 రోజుల టైం ఇచ్చినా ప‌ళ‌ని మాత్రం మూడు రోజులు చాల‌ని చెప్పారు.

ఇక సీఎం సీటు కోసం 117 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం కాగా ప‌ళ‌నికి 122 ఓట్లు ప‌డ్డాయి. ఎమ్మెల్యేల‌తో అవిశ్వాస తీర్మానంలో త‌న‌కు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు ప‌ళ‌నిస్వామి వేసిన ఎత్తుల మందు ప‌న్నీరు చిత్త‌య్యారు. 31 మంది మంత్రుల‌కు గాను ప‌ళ‌ని ఒక్కో మంత్రికి 4 గురు ఎమ్మెల్యేల‌ను అప్ప‌గించారు. వారు ఎటూ వెళ్ల‌కుండా వ్యూహాత్మ‌కంగా క‌ట్ట‌డి చేశారు. సో ఫైన‌ల్‌గా త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌తో దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లోకి ఎక్కారు.