రాయలసీమ జిల్లాలు అంటేనే విపక్ష వైకాపా అధినేత జగన్కు కంచుకోటలు. ఇక వీటిల్లో కడప జిల్లా…అందులోను జగన్ సొంత జిల్లా పులివెందుల అంటే అక్కడ వైకాపాతో పాటు జగన్ క్రేజ్, రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైఎస్ ఉన్నప్పుడు అక్కడ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో టీడీపీ నుంచి నామినేషన్ వేయాలంటేనే ఆ పార్టీకి ఎవ్వరూ అభ్యర్థులు ఉండేవారు కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను అక్కడ వైఎస్ ఫ్యామిలీకి ధీటుగా పోరాడారు టీడీపీ నేత సతీష్రెడ్డి.
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా, శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్న సతీష్రెడ్డి పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టిన ధీరుడిగా నిలిచారు. యేడాదిన్నర కాలంగా ఆయన ఓ శపథం చేశారు. పులివెందుల నియోజకవర్గ రైతులకు కృష్ణా నీరు ఇచ్చే వరకు తాను గడ్డం తీసేది లేదని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎట్టకేలకు యేడాదిన్నర తర్వాత సతీష్రెడ్డి గెడ్డం దీక్షకు మోక్షం కలగనుంది.
గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందులకు కృష్ణా జలాలను తెచ్చేవరకు తాను గెడ్డం తీసేది లేదని ఆయన గెడ్డం దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. ఈ జలాలను పైడిపాళేనికి తీసుకువస్తేనే పులివెందల ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆయన చెపుతున్నారు. ఈ అంశాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించి ఆయనను ఒప్పించి కృష్ణా జలాలను తరలించే పనులను ప్రారంభింపజేశారు. ఈ యేడాదిన్నర కాలంలో ఈ పథకం త్వరగా పూర్తయ్యేందుకు ఆయన నిత్యం అధికారులతో పోరేసుకుని..పనులు కంప్లీట్ చేయించారు.
ఈ నెల 11న ఏపీ సీఎం చంద్రబాబు పైడిపాళేనికి కృష్ణా నీరు ఇచ్చే పంపింగ్ పథకాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక తన శపథం నెరవేరడంతో సతీశ్ రెడ్డి అదే రోజు గడ్డం తీయనున్నారు. ఇక రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు పులివెందులకు నీరు రప్పించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో కరువు ప్రాంతమైన పులివెందులకు నీరు వస్తుండడంతో ఈ ప్రాంత రైతులతో పాటు ప్రజల ఆనందాలకు అవధులు లేవు. ఇక్కడ టీడీపీ దీనిని హైలెట్ చేస్తూ ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోతోంది. ఇక జగన్కు ఇక్కడ కొంత పట్టు సడలుతున్నట్టే కనిపిస్తోంది.