పాలిటిక్స్ అన్నాక నిన్న కొట్టుకున్న వాళ్లు.. నేడు కలిసిపోవడం, నేడు తిట్టుకున్నవాళ్లు .. రేపు కలిసిపోవడం మామూలే. ఇప్పుడు ఇదే సీన్.. తెలంగాణ అధికార పార్టీలోనూ కనిపిస్తోందని సమాచారం. నిన్న మొన్నటి వరకు కేంద్రం తమపై వివక్ష చూపిస్తోందని, నిధులు సరిగా ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున విరుచుకుపడిన టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నేతృత్వ పార్టీ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయ్యారనే టాక్ హల్చల్ చేస్తోంది.
వాస్తవానికి నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా కేసీఆర్.. కేంద్రంపై గుర్రుగానే ఉన్నారు. అసలు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల తెలంగాణలో పనులు ఆగిపోయాయని, కార్మికులు నష్టపోయారని, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి.. ప్రభుత్వ ఖజానా కొల్లబోయిందని తన అనుచరుల వద్ద పెద్ద ఎత్తున ఆయన వాపోయారు. అయితే, ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలు కేసీఆర్ వైఖరిని పూర్తిగా మార్చేశాయి. ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం, అక్కడ ప్రధాని మోదీతో భేటీ కావడం తెలిసిందే.
ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్.. నోట్ల రద్దుకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ నగదు రహిత లావాదేవీలకు మళ్లాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్లో జరిగి డీజీపీల సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోడీతో అక్కడే పక్కకు వెళ్లి మరీ మాట్లాడారు. ఇదిలావుంటే ఇటీవల జరిగిన కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె వివాహ విందులోనూ కేసీఆర్.. హైదరాబాద్కి చెందిన కేంద్ర మంత్రి దత్తాత్రేయతో భేటీ అయ్యారు.
పరిణామాలను గమనించిన రాజకీయ వర్గాలు.. ఎన్డీఏతో కేసీఆర్ జట్టుకడుతున్నారని అంటున్నారు. నిజానికి కేంద్రంతో జట్టుకట్టాలనేది 2014లోనే కేసీఆర్ వ్యూహం. అయితే, అప్పట్లో ఎన్డీఏకి మంచి మెజారిటి రావడంతో వచ్చిన పార్టీలనే కులుపుకొని పోయింది. కానీ, 2019 ఎన్నికల నేపథ్యంలో తమతో ఎవరు కలిసి వస్తే బాగుంటుందో నిర్ణయించుకుని వారితో చెలిమికి సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రధాని మోడీనే కేసీఆర్ను తమతో కలవాలని కోరినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తన మంత్రి వర్గంలో టీఆర్ ఎస్కి చోటు కూడా కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయో చూడాలి. ఒక్కటైతే.. నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ తనయకు ఖాయమని చెప్పొచ్చు.