వైకాపా అధినేత జగన్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నారు. 2014లో కొంచెం తేడాతో సీఎం సీటు కోల్పోయానన్న బాధ ఆయనను ఒక పక్క వేధిస్తున్నా.. మరోపక్క మాత్రం.. పొలిటికల్గా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆకర్ష్ పిలుపుతో వైకాపా నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగిపోయాయి. క్యూకట్టి మరీ.. వైకాపా నేతలు, జిల్లా స్థాయి ఇంచార్జ్లు సైతం సైకిలెక్కేశారు. దీంతో జగన్కి ఎప్పుడు ఏం జరుగుతోందో కూడా తెలియని టెన్షన్ పట్టుకుంది.
ఇక, పోయినోళ్లు పోగా.. ఉన్నోళ్లే మనోళ్లు. అన్న వైఖరితో జగన్ తన స్టైల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే, మరోపక్క, వేరే పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇప్పుడు వైకాపాలోకి వస్తున్నారు. దీంతో జగన్.. ఇక తన పార్టీలోకి ఎవరు వస్తారు? అని తెగ చింతించేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో ఆయనలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని తెలుస్తోంది. నిజానికి ఈ పరిణామం ఇప్పట్లో ఊహించింది కాదు. తన పార్టీ నుంచే ఎప్పుడు ఎవరు జండా పీకేస్తారో తెలియక జగన్ చింతిస్తున్న నేపథ్యంలో ఇలా జరగడం ఆయనలో ఆనందాన్ని నింపింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెల్లపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్లు వైకాపాలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వీరు పెద్ద స్థాయి నేతలు కాకపోయినా.. వైకాపాలో చేరుతున్నారన్న ఆనందం జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఆయన మంచి జోష్ మీద ఉన్నారట. అంతేకాదు, రాబోయే రోజుల్లో మరింత మంది వైకాపాలోకి వచ్చే అవకాశం ఉందని ఆపార్టీ వర్గాలు చెబుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.