తెలంగాణ అసెంబ్లీలో హిట్ ఎవరు? ఫ్లాప్ ఎవరు? తాజాగా ముగిసిన శీతాకాల సమావేశాల అనంతరం పొలిటికల్ పండితులు పెట్టిన దృష్టి దీనిపైనే. వాస్తవానికి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలపై సభ వెలుపల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. మల్లన్నసాగర్ మొదలుకుని ప్రగతి భవన్, డబుల్ బెడ్ రూం, హైదరాబాద్ రోడ్లు, రైతుల మరణాలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా అనేక విషయాలపై మీడియా గొట్టాలు పగిలిపోయేలా కేసీఆర్, ఆయన టీంపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. దీంతో సాధారణంగానే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షంపై వీరంతా దాడి చేస్తారని, అసెంబ్లీలో రచ్చ ఖాయమని అనుకుంటారు.
కానీ, అలాంటిదేమీ కనిపించక పోవడమే ఇప్పుడు టాపిక్గా మారింది! బయట పెద్ద ఎత్తున విమర్శలు సంధించిన నేతలు సైతం సభలో పిల్లులు మాదిరిగా మారిపోయారట. అంతేకాదు, కొందరైతే .. సభలో హాజరు వేయించుకుని, సీటులో కూర్చోవడం తప్ప..ఇంకే మీ చేయలేదని కూడా చర్చించుకుంటున్నారు. దీనికంతటికీ కారణం ఏంటని ఆలోచిస్తే.. అందరి వేళ్లూ ఇప్పుడు సీఎం కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. తన చాతుర్యంతో ఎంతటి రాజకీయ నేతలనైనా కరిగించే కేసీఆర్.. ఆ విధంగానే తెలంగాణ సాధించారని చెప్పకొంటారు. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్రంలోని విపక్ష నేతల్లో ఉన్న వీక్ నెస్లను గమనించి.. వాటిని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమయ్యారట.
తాజాగా జరిగిన సభలో కాంగ్రెస్ నేతలు పూర్తిగా తమ సీనియర్ నేత జానా రెడ్డిపై డిపెండ్ అయిపోయారు. జానా అయితే, కేసీఆర్ను కడిగిపారేస్తారని అనుకున్నారు. కానీ, కేసీఆర్ దెబ్బకి జానా ఫ్లాట్ అయిపోయారు. కేసీఆర్ మైకందుకుని ‘సభలో పెద్దలు జానారెడ్డి లాంటివారు ఉన్నారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు’ అనేసరికి జానా ఫ్లాట్ అయిపోవడం.. చర్చ పెద్ద ఎత్తున నీరుగారి పోవడం మామూలైపోయింది. ఇక, టీడీపీలో ఒకే ఒక్కడుగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. వీక్నెస్ తెలిసిన కేసీఆర్.. అండ్ కో ఓటుకు నోటును ఆయుధాన్ని బాగానే వాడుకుంటున్నారు. దీంతో రేవంత్ వాయిస్ కట్!
ఇక, బీజేపీ నేతలు పైనుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో కేసీఆర్ జోలికి కూడా వెళ్లడం లేదు. టీడీపీలో బీసీ జాతీయ నేత ఆర్ . కృష్ణయ్య ఉన్నా కూడా ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఇక, సీపీఎంకు ఉన్న ఒకే ఒక్కడు మెడలో ఎర్రకండువా ధరించడం తప్ప.. ఎజెండాలో ఏం మాట్లాడాలో కూడా తెలియకపోవడం టీఆర్ ఎస్కి కలిసొచ్చిన అంశం. దీంతో తెలంగాణ అసెంబ్లీలో సూపర్ హిట్ ఎవరంటే.. కేసీఆర్.. సూపర్ ఫ్లాప్ ఎవరంటే.. విపక్షాలు అనేస్థాయిలో ప్రచారం జరుగుతోంది.నిజమేకదా! అంటున్నారు విశ్లేషకులు కూడా!!