మెగాస్టార్ చిరంజీవి కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాస్ ఈజ్ బ్యాక్ అనే పల్లవితో సాగే స్పెషల్ ఐటెం సాంగ్ షూటింగ్ సైతం ఆదివారంతో కంప్లీట్ అయ్యింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు స్కైను టచ్ చేస్తున్నాయి.
వెండితెరను రెండు దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యంతో ఏలిన చిరు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్లో జరుగుతోంది. చిరు వెండితెకు పదేళ్లు దూరంగా ఉన్నా చిరుకు ఇక్కడ ఎలాంటి పవర్ ఉందో ఖైదీ నెంబర్ 150 కి జరుగుతున్న బిజినెస్ చూస్తే అర్ధమవుతుంది.
ఏపీలో మెగా ఫ్యామిలీకి మంచి పట్టున్న ఉత్తరాంధ్ర ఏరియా – ఈస్ట్ – వెస్ట్లలో టాలీవుడ్ హిస్టరీలోనే ఆల్ టైం రికార్డు రేటుకు ఖైదీ నెంబర్ 150 రైట్స్ అమ్ముడయ్యాయి. నైజాంతో పాటు కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని ఏరియాల్లో భాగస్వామ్య పద్ధతిలో గీతా ఫిలింస్ సంస్థే స్వయంగా రిలీజ్ చేయనుంది.
ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం ఏపీ, తెలంగాణలో మాత్రమే ఈ సినిమాకు ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు జరగని విధంగా రూ. 62 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్, కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కూడా కలుపుకుంటే రూ.100 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఈ సినిమా బిజినెస్ జరిగినట్టు సమాచారం.
ఇక శాటిలైట్.. ఆడియో రైట్స్ రూపంలో మరో 20 కోట్లు సమకూరనున్నాయట. మొత్తంగా ఖైదీ కౌంటింగ్ ఇప్పటికే 120 కోట్లను దాటిపోయిందని తెలుస్తోంది.